Mahabubunagar: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ సమయంలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతిచెందగా.. ఈదురుగాలుల తీవ్రతకు భారీ స్థాయిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం కురుమిద్దకు చెందిన సాంబశివ (8) తల్లిదండ్రులతో కలసి పొలం వద్దకు వెళ్లగా పిడుగు పడి అక్కడికక్కడే చనిపోయాడు.
Mahabubunagar: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం ఎండలు దంచికొట్టిన మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఆ వాన బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. మహబూబ్నగర్ జిల్లా లోని రాజాపూర్ మండలం మర్రిబాయితండాకు చెందిన శత్రునాయక్ (60) ఆదివారం సాయంత్రం పొలంలో దగ్గరకు వెళ్లాడు.
ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పొలం వద్దనే ఉన్నారు. ఆ సమయంలో పిడుగు పడటంతో ఆయన మృతి చెందాడు. అదే సమయంలో నారాయణపేట జిల్లా మాగనూర్లోని కొత్త రైల్వేస్టేషన్ సమీపంలో కుర్వ లింగప్ప (20) అనే వ్యక్తి గొర్రెలను మేపుతుండగా పిడుగుపాటుకు గురై.. మృతి చెందాడు.
అలాగే.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం కురిమిద్ద గ్రామానికి చెందిన తిరుపతయ్య, చంద్రకళ అనే భార్యభర్తలు తమ కుమారుడుసాంబశివ (8)తో కలిసి తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఆ సమయంలో జోరుగా వర్షం కురవడంతో వారితో పాటు చుట్టుపక్క పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలంతా.. సమీపంలో ఉన్న చెట్టు కిందకు చేరారు. ఆ సమయంలో పిడుగు పడటంతో సాంబశివుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదుగురు గాయపడ్డారు.
మరోవైపు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గాలి దుమారం బీభత్సం సృష్టించడంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సూర్యాపేటలోని చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), నూతనకల్, మద్దిరాల, మోతె మండలాల్లో వీచిన ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు తీగలు తెగిపోయాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. మునుగోడులో మోస్తరు వాన పడింది. చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంపై చెట్టు విరిగి పడింది. దీంతో భవనం స్వల్పంగా దెబ్బతిన్నది. సంగెం మండలం గవిచర్లలో కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. వరంగల్- నెక్కొండ రోడ్డులో చెట్టు నేలకొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మామిడి, నిమ్మ, సపోట తోటలు దెబ్బతిన్నాయి.
రాష్ట్రంలో నేడు, రేపు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
