నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో వృద్ధుడు గాయపడ్డారు. మృతిచెందినవారిని నందిపేట్ మండల కేంద్రానికి చెందిన అశోక్, మోహన్, రమేష్లుగా గుర్తించారు. మృతులు జగిత్యాల జిల్లాలోకి కొండగట్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కారు తీవ్రంగా దెబ్బతినడంతో క్రేన్ సాయంతో మృతులను కారులో నుంచి వెలికితీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.