నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం యరసానిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. 

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం యరసానిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన ఘటనలో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికికి తీసుకెళ్లారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను ఖమ్మం జిల్లాకు చెందిన ఎండీ ఇద్దాక్ (21) ఎస్‌కే సమీర్ (21) ఎస్‌కే యాసీన్ (18)లుగా గుర్తించారు. 

వీరంతా హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై ఖమ్మంకు తిరిగి వెళ్తుండగా యరసానిగూడెం వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.