తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. ఒక ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. చిట్యాల మండలం కైలాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు వ్యవసాయ కూలీలు మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం వర్షం రావడంతో అక్కడికి సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు చిలివేరు సరిత (30), నేరపాటి మమత (32) అక్కడికక్కడే మృతి చెందారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ఘటనలో భద్రమ్మ, ఉమకు తీవ్ర గాయాలు కాగా సమ్మయ్య, కొమ్మురమ్మ, కుమార్‌లకు స్పల్ప గాయాలయ్యాయి. దీంతో భద్రమ్మ, ఉమలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Also Read: సెప్టెంబర్ 17న 10 లక్షల మందితో సభ.. సోనియా ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారు: రేవంత్

మరో ఘటన కాటారం మండలం దామరకుంట‌లో చోటుచేసుకుంది. దామరకుంట గ్రామానికి చెందిన జి రాజేశ్వర్‌రావు, తన భార్య సునీత, ఇద్దరు కూలీలను వెంటపెట్టుకుని తాను కౌలుకు చేస్తున్న పొలంలో కలుపు తీసేందుకు వెళ్లాడు. సునీత, ఇద్దరు కూలీలు పొలంలో కలుపు తీస్తుండగా.. పొలం గట్టుపై ఉన్న రాజేశ్వరరావుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తన కళ్ల ముందే భర్త మరణించడంతో సునీత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.