దోపిడీ దొంగలు సరికొత్త ఎత్తుడగలతో దోపిడీలు చేస్తున్నారు. వీలైనంత వరకు టెక్నాలజీని వాడుకుని దోపిడీలకు తెగబడుతున్నారు. తాజాగా కొత్త తరహా రైళ్ల దోపిడీ గ్యాంగ్ గుట్టు రట్టు అయింది. వాళ్లు దోపిడీ చేసే స్టైల్ చూస్తే షాక్ కు గురి కావాల్సిందే. రైళ్లలో దోపిడీలకు పాల్పడే నలుగురు కేటుగాళ్లను ఖమ్మం రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు.
మహారాష్ట్రకు చెందిన షోలాపూర్, ఉస్మానాబాద్ జిల్లాలకు చెందిన నలుగరు యువకులు కిరణ్ రిసూ బోన స్లే (22), రాహుల్ సునీల్ బోన్ స్లే (19), ఉల్ఫ్ బోన్ స్లే (30), విజయ్ హరిచంద్ర షిండే (20) ఈ నలుగురు యువకులు గ్యాంగ్ గా ఏర్పడి రైళ్లలో దోపిడీలకు తెగబడుతున్నారు.
నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్తారు. అక్కడ రైలు పట్టాల పక్కనున్న సిగ్నల్ బాక్సులను ఓపెన్ చేస్తారు. ఆ బాక్సులో ఉన్న కేబుల్స్ కట్ చేస్తారు. దీంతో వెంటనే రెడ్ సిగ్నల్ పడుతుంది. తదుపరి అక్కడికి రైలు రాగానే సిగ్నల్ లేని కారణంగా ఆగిపోతుంది. వెంటనే వీళ్లు కత్తులు, మారణాయుధాలతో బోగీల్లోకి చొరబడి... బెదిరింపులకు గురి చేసి ప్రయాణీకుల వద్ద ఉన్న నగలు, సొమ్ములు, డబ్బులు దోచుకుని అక్కడి నుంచి పరారైతారు.
డోర్నకల్ రైల్వేస్టేషన్ సమీపంలో, తొండాల గోపారం స్టేషన్ సమీపంలో సిగ్నల్ బాక్సుల్లో కేబుల్స్ కట్ చేశారు. ఆ సమయంలో అక్కడ ఆగిన చార్మినార్, గౌతమి, కోనార్క్ ఎక్సప్రెస్ రైళ్లలో మహిళలను బెదిరించి గొలుసులు దోపిడీ చేశారు.వీరు అలాగే... గంగా కావేరి ఎక్స్ ప్రెస్ లో చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు.
వీళ్ల దోపిడీలపై ఫిర్యాదులు రావడంతో ఖమ్మం జిఆర్ పి పోలీసులు నిఘా ముమ్మరం చేసి వీరిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.నిందితులంతా... ఖమ్మం రైల్వే స్టేసన్ సమీపంలో కోనార్క్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
సో.... రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎందుకైనా మంచిది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన వెల్లడిస్తోంది.
