ఈ ఎన్నికలే నాకు చివరివి: మోత్కుపల్లి
ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. ఆలేరుకు గోదావరి జలాలు అందించడమే తన అంతిమ లక్ష్యం అని చెప్పారు.
ఆలేరు: ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. ఆలేరుకు గోదావరి జలాలు అందించడమే తన అంతిమ లక్ష్యం అని చెప్పారు.
ఆలేరుకు గోదావరి జలాలు అందించి రాజకీయ జీవితాన్ని ముగిస్తానని స్పష్టం చేశారు. ఈనెల 27న యాదాద్రి నుంచి ఎన్నికల శంభారావం పూరించనున్నట్లు మోత్కుపల్లి వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ పదవి చేపట్టాలని కోరిక. తన మనసులోని మాటను సీఎం చంద్రబాబుకు సైతం తెలిపారు. రోశయ్య పదవీకాలం ముగియడంతో తమిళనాడు గవర్నర్ పదవి ఇవ్వాలని చంద్రబాబునాయుడును మోత్కుపల్లి కోరారు. అందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు మోత్కుపల్లి. దాదాపు ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ కుట్రలకు బలయ్యానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు తనను నమ్మించి మోసం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేసీఆర్ను ఎన్టీఆర్ ప్రతిరూపమని కొనియాడారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన తెలంగాణ టీడీపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.