Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్‌ : మగువలకు మందేసుకుంటే కానీ మనసున పట్టడం లేదట..

మద్యం వైపు మొగ్గు చూపుతున్న మహిళల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని ఓ సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. నిజామాబాద్ జిల్లాలో ఉన్న మహిళల్లో 9.8 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఇది రాష్ట్ర సగటు కంటే ఎక్కువ కావడం గమనార్హం

The Number Of Women Addicted To Alcohol Is Increasing in Nizamabad - bsb
Author
Hyderabad, First Published Dec 16, 2020, 1:46 PM IST

మద్యం వైపు మొగ్గు చూపుతున్న మహిళల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని ఓ సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. నిజామాబాద్ జిల్లాలో ఉన్న మహిళల్లో 9.8 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఇది రాష్ట్ర సగటు కంటే ఎక్కువ కావడం గమనార్హం. 

జిల్లాలో ప్రతి వంద మంది మహిళల్లో సుమారు పది మందికి మందు తాగే అలవాటు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణ ప్రాంతాల్లోనూ అతివలకు మద్యం తీసుకునే అలవాటు ఉన్నట్లు తేలింది. 

మద్యం సేవించే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 6.7 శాతం ఉండగా,  ఒక్క నిజామాబాద్ జిల్లాలో మాత్రం అంత కంటే 3.1 శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దేశ వ్యాప్తంగా ఇటీవల ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించింది. 

కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అనే సంస్థ ద్వారా ఈ సర్వే చేపట్టింది. గతేడాది 2019 జూన్‌ 30 నుంచి నవంబర్‌ 14 వరకు సర్వే బృందం ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 27,351 కుటుంబాలను కలిసి వివరాలను తీసుకోగా, నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి 891 కుటుంబాలను సర్వే చేసింది. 

ఈ సర్వేలో 15 ఏళ్లకు పైబడిన వారి నుంచి వివరాలను తీసుకున్నారు. మొత్తం 104 అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సర్వే నివేదికను ఇటీవల వెల్లడించగా, ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఇక పురుషుల విషయానికి వస్తే, 40 శాతం మంది మగవారు మందు తీసుకున్నట్లు వెల్లడైంది. జిల్లాలో ఉన్న పురుషుల్లో 40.02 శాతం మందికి మందు అలవాటు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇది రాష్ట్ర సగటు కంటే కాస్త తక్కువగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 43.3 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు సర్వే పేర్కొంది. 
 
ఇందులో భాగంగానే పొగాకు ఆధారిత ఉత్పత్తుల వినియోగంపై కూడా సర్వే చేసింది. ప్రధానంగా బీడీ, సిగరేట్, తంబాకు, గుట్కా వంటి వాటి అలవాటు ఉన్న వారి వివరాలను కూడా సేకరించారు. జిల్లాలో 8.6 శా తం మంది మహిళలు పొగాకు ఆధారిత ఉత్పత్తులకు అలవాటు పడినట్లు తేలింది. 

రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వినియోగించే మహిళల శాతం 5.6 శాతం కాగా, అంతకంటే సుమారు మూడు శాతం ఎక్కువ మంది మహిళలు జిల్లాలో పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డారు. పురుషుల విషయానికి వస్తే, జిల్లాలో 20.6 శాతం మంది ఫురుషులు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఈ అలవాట్లు ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 22.3 శాతం ఉన్నట్లు తేలింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios