టెన్త్ పేపర్ లీక్ కేసు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు షాక్.. నోటీసులు జారీ..
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్నం లీకేజ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్నం లీకేజ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఈటల రాజేందర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఇక, ఈ కేసులో ఏ-2గా ఉన్న మాజీ జర్నలిస్టు ప్రశాంత్.. ఈటల రాజేందర్కు కూడా పేపర్ షేర్ చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక, పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో బండి సంజయ్ను ఏ-1గా పేర్కొన్న పోలీసులు.. ఆయన ప్రధాన కుట్రదారు అని అభియోగం మోపారు. మరోవైపు ఆయనను బుధవారం సాయంత్ర మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే.. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ తో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని బండి సంజయ్, ప్రశాంత్ కుట్ర పన్నారని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. బుధవారంనాడు వరంగల్ లోని తన కార్యాలయంలో వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో ఏ1 గా బండి సంజయ్ ఉన్నారన్నారు. బండి సంజయ్ డైరెక్షన్ లోనే టెన్ల్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహరరం జరిగిందని సీపీ వివరించారు.
ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా సీపీ రంగనాథ్ చెప్పారు. హిందీ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్ కు ప్రశాంత్ వాట్సాప్ లో షేర్ చేసినట్టుగా చెప్పారు. అంతేకాదు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా ఈ నెల 4వ తేదీన ఉదయం 10:41కి ప్రశాంత్ ప్రశ్నాపత్రాన్ని షేర్ చేశారని ఆయన వివరించారు. ఈటల రాజేందర్కు పేపర్ షేర్ చేయడం కంటే ముందే బండి సంజయ్ కు వాట్సాప్లో ప్రశాంత్ ఈ పేపర్ ను పంపాడన్నారు.
ఈ విషయాన్ని ఇవాళ విచారణలో బండి సంజయ్ ఒప్పుకున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. అరెస్ట్ సమయంలో బండి సంజయ్ తన ఫోన్ లేదని చెప్పారన్నారు. బండి సంజయ్ ఫోన్ తమకు దొరికితే ఈ కేసులో మ రిన్ని ఆధారాలు బయటపెట్టేవాళ్లమన్నారు. వాట్సాప్ సర్వర్, సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సమాచారం సేకరిస్తామని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. ఓ గేమ్ ప్రకారమే ఇదంతా జరిగిందని వరంగల్ సీపీ రంగనాథ్ వివరించారు. పేపర్ లీక్ కంటే ముందు రోజే బండి సంజయ్ ప్రశాంత్ లు మాట్లాడుకున్నారన్నారు. వాటాప్న్ కాల్ లో బండి సంజయ్ , ప్రశాంత్ మాట్లాడుకున్నారని సీపీ వివరించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం ఇందులో కన్పిస్తుందని వరంగల్ సీపీ చెప్పారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం బండి సంజయ్, ప్రశాంత్ మధ్య వాట్సాప్ లో సంభాషణ ను తాము రిట్రీవ్ చేశామని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. వాట్సాప్ లో పేపర్ షేర్ చేసినందున ఎవరిని అదుపులోకి తీసుకోలేదని వరంగల్ సీపీ స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రం పంపిన తర్వాత ప్రశాంత్ 149 మందితో ఫోన్ లో మాట్లాడారని సీపీ చెప్పారు.
కక్షపూరితంగా బండి సంజయ్ ను ఇరికించారనేది అనేది అవాస్తవమని వరంగల్ సీపీ చెప్పారు. పరీక్షలు రద్దు చేయించాలనే దురుద్దేశం కన్సిస్తుందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. కక్ష రాజకీయాలు అయితే మిగిలిన బీజేపీ నేతలపై తాము కేసులు పెట్టాలి కదా అని సీపీ ప్రశ్నించారు. నిన్న ఉదయం 9:30 గంటలకే పేపర్ లీకైనట్టుగా ప్రశాంత్ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. పేపర్ ను బయటకు తీసుకువచ్చి పలు గ్రూపుల్లో షేర్ చేశారని తెలిపారు.