మంత్రి జగదీష్ రెడ్డి చేతిలో మైక్ లాక్కొన్న కోమటిరెడ్డి: వాగ్వాదం, ఉద్రిక్తత
కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రసాబాస మారింది. ప్రోటోకాల్ పాటించకుండా మంత్రి జగదీష్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకొంది.రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కొత్త రేషన్ కార్డులను పంపిణీని ప్రారంభించింది. అయితే మునుగోడు నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చౌటుప్పల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమం సందర్బంగా తనకు సమాచారం ఇవ్వకుండా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు.
తనకు సమాచారం ఇవ్వకుండానే ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన చేతిలోని మైక్ ను ఎమ్మెల్యే లాక్కొన్నాడు. దీంతో ఈ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకొంది.దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర వాదోపవాదాలు చోటు చేసుకొన్నాయి. తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు.ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకొంది.తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.