ప్రగతి భవన్ ముందు నర్సుల ఆందోళన, అరెస్ట్: పీఎస్ కు తరలింపు
ప్రగతి భవన్ ముట్టడికి విధుల నుండి తొలగించిన నర్సులు బుధవారం నాడు ప్రయత్నించారు. ఆందోళన నిర్వహించిన నర్సులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నర్సుల ఆందోళన సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకొంది.
హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడికి విధుల నుండి తొలగించిన నర్సులు బుధవారం నాడు ప్రయత్నించారు. ఆందోళన నిర్వహించిన నర్సులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నర్సుల ఆందోళన సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకొంది.
కరోనా సమయంలో కాంట్రాక్టు పద్దతిలో నర్సులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే రెండు రోజుల క్రితం నర్సులను విధుల నుండి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. విధుల నుండి ఉద్వాసనకు గురైన నర్సులు బుధవారం నాడు ప్రగతి భవన్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
కరోనా సమయంలో తమ సేవలను వినియోగించకొని ప్రస్తుతం ఉద్యోగాల నుండి తొలగించడాన్ని వారు తప్పుబడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రగతి భవన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నర్సులను విధుల నుండి తప్పించారు. విధుల నుండి ఉద్వాసనకు గురైన నర్సులు మంగళవారం నాడు వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.