అన్నదాతలకు గుడ్ న్యూస్... ఈ మూడురోజులూ తెలంగాణలో వర్షాలు
రాగల మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్: వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతాంగానికి వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. రాగల మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని... కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వెల్లడించారు. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందన్నారు. వీటి ప్రభావంతో ఇవాళ తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది వాతావరణ శాఖ ప్రకటించింది.
నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే తెలంగాణకు చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల ప్రారంభంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత మూడేళ్లలో తొలిసారిగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే వచ్చాయని తెలిపారు. ఇలా ఆరంభంలో బాగానే వున్నా రైతులు విత్తనాలు జల్లుకున్నాక వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో అన్నధాతలు వర్షాలు కోసం ఎదురుచూడాల్చిన పరిస్థితి ఏర్పడింది. వారి ఆందోళనను తొలగిస్తూ తిరిగి వర్షాలు ప్రారంభమయ్యాయి.