ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడి మృతి
ఉన్నత విద్య కోసం 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి సౌత్రన్ క్రాస్ యూనివర్శిటీలో ప్రస్తుతం పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత విద్యలు చదవి.. మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని కలలు కన్నాడు. కానీ.. అనుకోని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయాడు. బాత్ రూంలో జారి కింద పడి తలకు దెబ్బకు తగలడంతో చనిపోవడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం హరిదాస్ పల్లికి చెందిన సాయి రెడ్డి, నాగేంద్రమ్మ దంపతుల కుమారుడు హరి శివశంకర్ రెడ్డి(25) హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి సౌత్రన్ క్రాస్ యూనివర్శిటీలో ప్రస్తుతం పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
కాగా.. ఈ నెల 15వ తేదీన శివశంకర్ రెడ్డి ప్రమాదవశాత్తు బాత్రూంలో జారి పడ్డాడు. గమనించిన స్నేహితులు వెంటనే.. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. కాగా.. బాత్రూంలో జరిపడిన సమయంలో తలకు తీవ్రగాయమైందని.. మెడలో నరాలు చిట్లిపోయాయని వైద్యులు తెలిపారు. నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది తర్వాత కన్నుమూశాడు. కాగా.. శివశంకర్ రెడ్డి చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు తల్లిదండ్రులకు తెలియజేశారు.
విషయం తెలిసి వాళ్లు.. కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలంటూ ఆస్ట్రేలియా నుంచి ప్రవాస భారతీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. కాగా, సాయిరెడ్డి, నాగేంద్రమ్మ దంపతులకు నలుగురు సంతానం. గతంలో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. మిగిలిన ఒక్క కొడుకు శివశంకర్రెడ్డి కూడా చనిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.