భారీ వరదలు: మంజీరానదిలో చిక్కుకున్న నలుగురు
తెలంగాణలోని మంజీరా నది వరదల్లో నలుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. చేపలు పట్టడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు వరదలు ఉధృతంగా రావడంతో అందులో చిక్కుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. చేపలు పట్టడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు మంజీరా నదిలో చిక్కుకున్నారు. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నీరు పెద్ద యెత్తున చేరుతోంది.
మంజీరా నదిలోలో ఏడుపాయల హనుమాన్ బండ్ల వద్ద చేపలు పట్టడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు ప్రవాహంలో చిక్కుకున్నారు. వారిని యాదగిరి, స్కైలాబ్, ఎల్లం, నాగరాజులుగా గుర్తించారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరోసారి వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం నుంచే వర్షం కురవడం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్, కోఠీ, దిల్ షుక్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంకా కొన్ని కాలనీలు వరదలోనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
వారం, పది రోజులుగా హైదరాబాదును వర్షాలు వదలడం లేదు. మంగళవారం రాత్రి కాస్తా వర్షం కురిసింది. మళ్లీ ఈ రోజు ఉదయం నుంచే వానలు కురుస్తుండడంతో జంటనగరాల ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు.
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలశయాల్లోకి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆ రెండు రిజర్వాయర్ల నుంచి కిందికి నీరు వదలిరారు. హైదరాబాదులో దాదాపు 80 కాలనీలు ఇంకా వరదల్లోనే ఉన్నాయి.
వరద బాధితుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందుతున్నాయి. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్ట పోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.