heatwave: రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తూ.. మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
core heatwave zone: తెలంగాణలో ప్రస్తుతం ఎండల తీవ్రత మరింతగా పెరుగుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత అధికం కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ప్రజలు వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ, మధ్యాహ్నం వేళల్లో ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించింది. అలాగే, స్థానికంగా సంబంధిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలనీ, వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యం అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
తెలంగాణ కోర్ హీట్ వేవ్ జోన్ లోకి వెళ్లిందని నిపుణులు పేర్కొంటున్నారు. గత ఎనిమిది సంవత్సరాలలో ఎండల తీవ్రత కారణంగా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఈ అధికారిక గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ పరిశోధనల ప్రకారం కోర్ హీట్ వేవ్ జోన్ పరిధిలోకి వస్తుంది. 2015 మరియు 2016 సంవత్సరాల్లో హీట్వేవ్ కారణంగా చాలా మరణాలు నమోదయ్యాయని డేటా పేర్కొంది. అయితే, కరోనా మహమ్మారి ప్రేరేపిత లాక్డౌన్ తర్వాత 2020లో హీట్వేవ్ కారణంగా సంభవించిన మరణాలు గణనీయంగా తగ్గాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కోర్ హీట్వేవ్ జోన్ (CHZ) అంటే అత్యంత వేడి (అసాధారణ ఉష్ణోగ్రతలు) ఉండే ప్రాంతం. ఇది ఎక్కువగా మే నెలలో గమనించబడింది. సంబధిత విభాగాల పరిశోధనల ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ కోర్ హీట్ వేవ్ జోన్ పరిధిలో ఉన్నాయి.
“తెలంగాణలో 2014 నుండి 2020 వరకు వేడిగాలుల కారణంగా 1,008 మరణాలు నమోదయ్యాయి. 2015లో అత్యధికంగా 541 మరణాలు సంభవించగా, 2016లో 324 మరణాలు, 2017లో 108 మరణాలు సంభవించాయి” అని తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ డేటా తెలియజేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హీట్ వేవ్ ప్రకటించబడుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగా, తెలంగాణలోని రెండు మండలాలు హీట్వేవ్ తీవ్రంగా ఉన్న వర్గాలుగా వర్గీకరించబడ్డాయి. 62 క్లిష్టమైనవి, మరో 187 సెమీ-క్రిటికల్గా, మొత్తం మండలాల్లో 316 అప్రమత్తంగా మరియు 21 సురక్షితమైనవిగా వర్గీకరించబడ్డాయి. రాష్ట్రంలో 13.7 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్రమైన, క్లిష్టమైన మరియు సెమీ క్రిటికల్ జోన్లలో నివసిస్తున్నారు.
హైదరాబాద్ నగరం ఏడు రోజుల కంటే తక్కువ వేడిగా ఉండే ప్రాంతం కింద ఉంచబడింది. 2015లో నగరంలో కేవలం మూడు రోజుల వేడిగాలులు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రోజువారి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలోని 6 జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 రోజుల్లో ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
