తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ స్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 7వ తేదీన జరగనుంది. ఇందుకు సంబంధించిన హాల్టికెట్లను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నేడు విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను విడుదల చేసింది. ఆగస్టు 7వ తేదీన ఎస్సై రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందుకోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు నేటి (జూలై 30) నుంచి వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు TSLPRB ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు.. tslprb.in అధికారిక వెబ్సైట్లో నుంచి వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
‘‘ఎస్సై జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టిక్కెట్లను 2022 జూలై 30 ఉదయం 8 గంటల నుంచి 2022 ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు TSLPRB వెబ్సైట్: www.tslprb.inలో వారి వివరాలు ఎంటర్ చేయడం ద్వారా సంబంధిత ఖాతాలకు లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోలేని అభ్యర్థులు support@tslprb.inకు ఇ-మెయిల్ పంపవచ్చు లేదా 93937 11110 లేదా 93910 05006 నంబర్లో మమ్మల్ని సంప్రదించవచ్చు” అని TSLPRB ఒక ప్రకటనలో పేర్కొంది.
అభ్యర్థులు హాల్ టికెట్ను A4 సైజ్ పేపర్ ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో పేర్కొన్న సూచనలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. అయితే తప్పనిసరిగా కలర్ ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే బ్లాక్ అండ్ వైట్లో కాకుండా కలర్ ప్రింట్ తీసుకుంటే.. విజిబిలిటీ బాగుంటుందని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది.
ఇక, మొత్తం 554 పోస్టులకు 2,47,217 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 7న(ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 503 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది.
కీలక సూచనలు..
ఆగస్టు 7న నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించేది లేదని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. పరీక్షలో తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగటివ్ మార్కులు ఉంటాయని పేర్కొంది. హాల్ టికెట్పై అభ్యర్థి పాస్పోర్టు సైజు ఫోటో అంటించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించేది లేదని తెలిపింది. ప్రాథమిక పరీక్ష సమయంలో డిజిటల్ ఫింగర్ ప్రింట్ తీసుకోనున్నారు. అందుకే అభ్యర్థులు టాటూలు, మెహిందీ వంటివి పెట్టుకోవద్దని బోర్డు సూచించింది.