ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం హైదరాబాద్ కు వచ్చారు. ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలపై చర్చలు జరిగాయి. నేడు మరో సారి వీరిద్దరు సమావేశం కానున్నారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో శనివారం భేటీ అయ్యారు. వీరి మధ్య ఉదయం నుంచి రాత్రి వరకు సమావేశం జరిగింది. ఇందులో జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశం నేడూ కొనసాగే అవకాశం ఉంది. దాని కోసం ఆయన శనివారం రాత్రి ప్రగతి భవన్ లోనే ఉండిపోయారు. అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ హైకమాండ్ తో పలుమార్లు భేటీ అయ్యారు. సోనియా గాంధీ కుటుంబం, పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణకు వచ్చి కేసీఆర్ తో సమావేశమవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
గత కొంత కాలంగా సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ కు మధ్య సానిహిత్యం పెరిగింది. ఇటీవల ఆయన తెలంగాణకు వచ్చి తాజా రాజకీయ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆయన వెంట అధికారులు, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. అదే సమయంలో జరిగిన మీడియా సమావేశంలో పీకేతో సానిహిత్యంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ తన స్నేహితుడని, తాము చాలా కాలంగా కలిసి పని చేస్తున్నామని చెప్పారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పీకే టీఆర్ఎస్ కోసం పనిచేస్తారని స్పష్టం అయ్యింది.
టీఆర్ఎస్ తో గతంలోనే పీకే కు ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన పలు నియోజకవర్గాలో తాజా పరిస్థితులపై సర్వే నిర్వహించి సీఎం కేసీఆర్ కు దానిని అందజేశారు. అయితే ఆ సమయంలో కేవలం 30 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే నిర్వహిచారు. మిగిలిన 89 నియోజకవర్గాల్లో ఇటీవలే సర్వే నిర్వహించారు. ఆ నివేదికను సీఎంకు అందించి పరిస్థితులను వివరించడానికి సీఎం కేసీఆర్ తో శనివారం సమావేశం అయ్యారని అర్థం అవుతోంది. ఇందులో పీకే.. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే తాను గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు తెలంగాణలో టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తానని స్పష్టం చేసినట్టు స్పష్టం అవుతోంది.
సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ మధ్య ఆదివారం సమావేశం కూడా జరగనుంది. ఇందులో భవిష్యత్ కార్యాచరణ, ఇతర రాజకీయపరమైన ముఖ్య అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ లో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే, దాని నివేదిక, అలాగే టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను నేటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
