Telangana MLC Election Results: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. నల్గొండలో టీఆర్ఎస్ విజయం
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ (Telangana MLC Election Results) కొనసాగుతుంది. మొత్తం ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానాలకు అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు.
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ (Telangana MLC Election Results) కొనసాగుతుంది. మొత్తం ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానాలకు అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. కొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఖమ్మం ఎమ్మెల్సీ (khammam mlc results) స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కొటిరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్కు 917, స్వతంత్ర అభ్యర్థి నగేష్కు 226 ఓట్లు, మిగిలిన ఐదుగురు అభ్యర్థులకు 90 ఓట్లు వచ్చాయి. మిగిలిన చోట్ల కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
ఇక, తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. అందులో ఆరు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన ఆరు స్థానాలకు డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ నిర్వహించారు.
ఇక, ఆరు స్థానాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. మొత్తం 26 మంది అభ్యర్థులు ఈ ఆరు స్థానాల్లో పోటీ పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 1,320, నల్గొండ జిల్లాలో 1,233 , మెదక్ జిల్లాలో 1,018, ఖమ్మం జిల్లాలో 738, ఆదిలాబాద్ జిల్లాలో 862 ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని 2 స్థానాలకు 9 టేబుళ్లపై, ఆదిలాబాద్ జిల్లాలో 6 టేబుళ్లపై, మెదక్ జిల్లాలో 5 టేబుళ్లపై, నల్గొండ జిల్లాలో 5 టేబుళ్లపై, ఖమ్మం జిల్లాల్లో 5 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతల ప్రకటించనున్నారు.
కరీంనగర్ ఫలితంపై సర్వత్ర ఉత్కంఠ..
కరీంనగర్లోని రెండు స్థానాలకు అధికార టీఆర్ఎస్ తరఫున ఎల్ రమణ, భాను ప్రసాదరావు బరిలో నిలిచారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ బరిలో నిలిచారు. అయితే రవీందర్ సింగ్ గతంలో టీఆర్ఎస్కు చెందిన వ్యక్తి కావడంతో ఆయన సాధించే ఓట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, టీఆర్ఎస్ మాత్రం రెండు స్థానాల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తుంది.
అని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉండగా.. ఖమ్మం, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇంకా మిగిలిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. వీరిలో కొందరు టీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్థానం ఖాళీగా ఉంటే అక్కడ ఇద్దరు పోటీలో ఉన్నారు. అలాగే కరీంగనర్లో ఉన్న రెండు స్థానాలకు పది మంది పోటీలో ఉన్నారు. ఖమ్మంలో రెండు స్థానాలకు నలుగురు, నల్గొండలో ఒక స్థానానికి ఏడుగురు పోటీ చేస్తున్నారు. అలాగే మెదక్లో ఒక స్థానానికి ముగ్గరు పోటీలో నిలిచారు.