ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ వ్యూహాలు : జేడీ లక్ష్మీనారాయణతో తలసాని భేటీకి యత్నం, నెక్ట్స్ స్టెప్ ఏంటో..?
ఏపీలోనూ విస్తరించాలని చూస్తున్న బీఆర్ఎస్... సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో సత్తా చాటాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఇక టీఆర్ఎస్కు బీఆర్ఎస్గా ఆమోదముద్ర పడిన నేపథ్యంలో ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీలోనూ విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ముఖ్యనేతలపై బీఆర్ఎస్ కన్నేసినట్లుగా తెలుస్తోంది. అలాంటి వారిని బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో సమావేశం కోసం తెలంగాణ మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఆయనను బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు ఈ సమావేశం జరిగిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని తలసాని.. లక్ష్మీనారాయణతో చెప్పినట్లుగా సమాచారం. అయితే రాజకీయంగా నిర్ణయం తీసుకోవడానికి సమచం వుందని, లక్ష్మీనారాయణ అన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆప్తో ఇప్పటికే జేడీ లక్ష్మీనారాయణ టచ్లో వున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ALso Read:ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ : బెజవాడలో కార్యాలయ నిర్మాణం... శంకుస్థాపనకు కేసీఆర్
ఇకపోతే... విజయవాడలో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై 800 గజాల్లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఇందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18, 19 తేదీల్లో స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించనున్నార. జనవరి చివరి నాటికి ఏపీ రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీలను వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపనకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం వుంది.