‘‘ డైనమిక్ సిటీ ’’ హైదరాబాద్కు చేరుకున్నానన్న మోడీ.. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ : ప్రధానికి తలసాని కౌంటర్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్- బీజేపీ వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటరిచ్చారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో (bjp national executive meeting) పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారం ముందు నుంచే టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే రోజున విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా (yashwant sinha) కూడా హైదరాబాద్ కు రావడంతో ఇరు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలను రూపొందించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ట్వీట్ కు కౌంటరిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) .
హైదరాబాద్ చేరుకున్న వెంటనే ప్రధాని మోడీ ఇలా ట్వీట్ చేశారు. ‘‘డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తామని’’ పేర్కొన్నారు.
దీనికి కౌంటర్ గా ట్వీట్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ ను డైనమిట్ సిటీగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నగరం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ట్వీట్ చేసిన తలసాని.. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి, పోలీస్ కమాండ్ సెంటర్, ఇటీవల ప్రారంభోత్సం జరుపుకున్న టీ హబ్ 2.0 భవనాలను జత చేశారు.
అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీకి బేగంపేట ఎయిర్పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చిన మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిని బట్టి ఉంటుందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం తప్పనిసరిగా ప్రధానిని రిసీవ్ చేసుకోవాలని లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధిగా కేబినెట్లో ఉన్న వ్యక్తి రిసీవ్ చేసుకోవచ్చని చెప్పారు.
భారత్ బయోటెక్కు వచ్చినప్పుడు మోదీకి ప్రోటోకాల్ అవసరం లేదని విమర్శించారు. గతంలో ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చిన సందర్భాల్లో సీఎం కేసీఆర్ రిసీవ్ చేసుకున్నారని గుర్తుచేశారు. అప్పటి నుంచే ఇదంతా మొదలైందని అన్నారు. అందుకే ఇక్కడ తప్పుబట్టడానికి ఏం లేదన్నారు. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఉన్నారని.. ఆయనకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని చెప్పారు. ఆయన జూలై 2వ తేదీన హైదరాబాద్కు వస్తానని సీఎం కేసీఆర్కు చెప్పడంతో ఆయనను రిసీవ్ చేసుకోవడం జరిగిందన్నారు