కేంద్రానికి రూ. 150కే, రాష్ట్రాలకు రూ.400లకా?: వ్యాక్సిన్ ధరలపై కేటీఆర్ అసంతృప్తి
కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలకు విక్రయించడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలకు విక్రయించడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తాము ఒకే దేశం ఒకే ట్యాక్స్ విధానాన్ని అంగీకరించామన్నారు. ఒకే పన్ను విధానం (జీఎస్టీ)ని అంగీకరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ ప్రస్తుతం ఒకే దేశంలో వేర్వేరు వ్యాక్సిన్ ధరలను చూస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి రూ. 150, రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 400లకు వ్యాక్సిన్ ను ఫార్మా కంపెనీలు ధరలను నిర్ణయించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ ఏడాది మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే అందరికి వ్యాక్సిన్ అందించడానికి వీలుగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం ఫార్మా కంపెనీలను కోరింది. ఫార్మా కంపెనీలకు కేంద్రం రుణ సహాయాన్ని అందించింది.ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రానికి, మిగిలిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి, బహిరంగ మార్కెట్లో విక్రయించుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 600 విక్రయించాలని కోవిషీల్డ్ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీరం ఇనిస్టిట్యూట్ బుధవారం నాడు ప్రకటించింది. ఈ ధరలపై కేటీఆర్ గురువారం నాడు అసంతృప్తిని వ్యక్తం చేశారు.