విజయవంతంగా ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన.. తెలంగాణకు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ బిజి బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ వర్గాలతో పలు సమావేశాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు పరిశ్రమలను తెలంగాణకు వచ్చేలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. దావోస్ లో నాలుగు రోజుల పర్యటనలో కేటీఆర్ 52 వ్యాపార సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు నిర్వహించినట్టు వివరించింది.
దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ మరో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ పేరుతో భాగ్యనగరంలో తమ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు పెప్సికో సంస్థ కార్పొరేట్ కార్యకలాపాల కార్యనిర్వాక ఉపాధ్యక్షులు రాబర్టో అజేవేడోతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు...ఇందులో భాగంగా ఉద్యోగులను 2800 నుంచి 4 వేలకు పైగా పెంచనున్నట్లు పెప్సికో సంస్థ ప్రకటించింది. పెప్సికో నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేసారు.