ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని అక్కడి ఇంజనీర్లు అంటున్నారన్నారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాలన, అక్కడి పరిస్ధితులపై తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి హరీశ్ మరోసారి దుమారం రేపారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని అక్కడి ఇంజనీర్లు అంటున్నారన్నారు. ఐదేళ్లు పట్టే అవకాశం వుందని చెబుతున్నారని హరీశ్ రావు తెలిపారు. మన దగ్గర కాళేశ్వరంపై ప్రతిపక్షాలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపోతే.. త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు మంత్రి హరీశ్ రావు . ఇందులో 95 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన తెలిపారు. అభ్యర్ధుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే కేసీఆర్ శిక్షణ తరగతుల కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని... వాటిలో 17 వేల పోలీస్ ఉద్యోగాలు వున్నాయన్నారు. 

ALso REad:ఏపీలో టీచర్లను లోపలేస్తున్నారన్న హరీశ్ రావు.. వచ్చి చూడాలంటూ బొత్స కౌంటర్

అంతకుముందు కొద్దిరోజుల క్రితం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో టీచర్లకు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని మంత్రి అన్నారు. అయితే రాష్ట్రంలో వేతనాలు కాస్త ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేనని హరీశ్ రావు అంగీకరించారు. అంతేకాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్‌లా కేంద్రం పెట్టిన షరతులకు అంగీకరించి వుంటే ఏటా రూ.6 వేల కోట్ల అప్పులు తీసుకుని రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేవారమని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే... ఏపీలో కరెంట్ కోతలపైనా హరీశ్ రావు మొన్నామధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు కొందరినీ కలిశానని చెప్పారు. వాళ్లది గుత్తి, అనంతపురం అని చెప్పారని... మీ దగ్గర కరెంట్ ఎంత సేపు వుంటుందని అడిగానని హరీశ్ రావు తెలిపారు. ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు కరెంట్ వుంటుందని తనకు చెప్పారని మంత్రి చెప్పారు. మళ్లీ గంట గంటకి కరెంట్ పోతుందని తెలిపారని హరీశ్ రావు వెల్లడించారు.