మన రైతుల పరిస్ధితేంటి... కేంద్రం పాలసీపై హరీశ్ రావు సీరియస్
కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని ఆయన కోరారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంకోల్ మండలంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు.
ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీ వల్ల రైతులకు నష్టం కలుగుతుందన్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కందులు కొంటే మన రైతుల పరిస్థితి ఏంటని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఇక్కడి రైతులకు లాభం జరగాలంటే, మంచి ధర రావాలంటే కేంద్రం కందులను దిగుమతి చేసుకోవడం నిలిపివేయాలని ఆయన కోరారు.
ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధర పెరిగితే ఎగుమతులను నిలిపివేస్తారని... ఇది సరికాదని హరీశ్ అన్నారు. మధ్య తరగతి ప్రజానీకానికి సాయం చేయాలంటే రైతు వద్ద కొని రాయితీతో అందజేయాలన్నారు.
పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని.. అంతర్జాతీయ పత్తి మార్కెట్లో పత్తి ధర పెరిగితే అది సీసీఐకి లాభమని, కానీ రైతుకు మాత్రం ఏ లాభం జరగడం లేదన్నారు. లాభాలను రైతులకు పంచాల్సిన బాధ్యత సీసీఐ, కేంద్ర ప్రభుత్వంపైనా ఉందన్నారు.
"