సినిమా చూపిస్తూ అరుదైన సర్జరీ చేసిన వైద్యులకు మంత్రి హరీశ్ అభినందనలు
హైదరాబాద్: ఆపరేషన్ సమయంలో ఆమె ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు వైద్యులు సరికొత్త విధానాన్ని అవలంభించారు. రోగి ఎంతగానో అభిమానించే టాలీవుడ్ నటుడు, మెగాస్తార్ చిరంజీవి సినిమా "అడవి దొంగ"ను చూపిస్తూ.. ఆమెకు సర్జరీ చేశారు.
హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వైద్యులు కొత్త అవిష్కరణలు చేస్తున్నారు. తమదైన తరహాలో వైద్యం అందిస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే రోగికి మత్తుమందు ఇవ్వకుండానే వారు స్పృహలో ఉండగానే.. సినిమా చూపిస్తూ సర్జరీ చేసి చరిత్ర సృష్టించారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. రోగి చూపిస్తూ ఆమె స్పృహలో ఉండగానే తలకు ఆపరేషన్ చేశారు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు. ఈ అరుదైన ఘనత సాధించిన వైద్యులకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అశినందనలు తెలిపారు. "ఒక ప్రాణాన్ని కాపాడేందుకు తమ వృత్తి ధర్మంలో నైపుణ్యతను ప్రదర్శించి..రోగి స్పృహలో ఉండేలా ఇష్టమైన సినిమా చూపిస్తూ గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన అరుదైన సర్జరీ అందరినీ ఆకట్టుకుంది. నటుడు చిరంజీవి గారి ప్రశంసలు మా ప్రభుత్వ వైద్యులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని" మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
కాగా, హైదరాబాద్ నగరానికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రి రాగా, వైద్య పరీక్షల్లో ఆమె మెదడులో కణతిని గుర్తించారు. ఈ క్రమంలోనే రోగికి ఆగస్టు 25న ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఆపరేషన్ సమయంలో ఆమె ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు వైద్యులు సరికొత్త విధానాన్ని అవలంభించారు. రోగి ఎంతగానో అభిమానించే టాలీవుడ్ నటుడు, మెగాస్తార్ చిరంజీవి సినిమా "అడవి దొంగ"ను చూపిస్తూ.. ఆమెకు సర్జరీ చేశారు. ఆమె సినిమా చూస్తుండగానే.. వైద్యులు ఆమెతో మధ్య మధ్యలో మాట్లాడుతూ జర్జరీని పూర్తి చేశారు. విజయవంతంగా ఆపరేషన్ జరిగిన తర్వాత వైద్యులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, స్పృహలో ఉండగానే రోగి మెదడుకు సర్జరీ చేసే పద్ధతిని ‘అవేక్ క్రేనియాటోమీ’ అంటారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. తన అభిమాని, తన సినిమా చూస్తూ.. సర్జరీ చేయించుకున్న విషయం మెగాస్టార్ చిరంజీవికి తెలియడంతో ఆయన కూడా దీనిపై స్పందించారు. వైద్యులకు అభినందనలు తెలిపారు. ఆపరేషన్ చేసిన వైద్యులతో పాటు సర్జరీ చేయించుకున్న మహిళను మరో రెండు రోజుల్లో కలుస్తానని చెప్పారు.
కాగా, ప్రజారోగ్యానికి సంబంధించిన అన్ని రంగాల్లో ఎనిమిదేళ్లుగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు, కృషి తెలంగాణకు అనేక సానుకూల ఫలితాలను ఇచ్చాయని ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు అంతకుముందు ఓ కార్యక్రమంలో అన్నారు. రాజేంద్రనగర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్) కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను ప్రారంభించిన తర్వాత హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి అంకితమైన సంస్థలను ఆదుకోవాల్సిన ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గ్రహించారని అన్నారు. 2015లో రాజేంద్రనగర్లో 45 ఎకరాల భూమిని కేటాయించి హైదరాబాద్లోని ఐఐపీహెచ్ వంటి ప్రఖ్యాత పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి 10 కోట్లు కేటాయించిన విషయం గుర్తు చేశారు.