దేవరుప్పులలో బీజేపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.ఈ దాడి ఘటనకు సంబంధించి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవరుప్పులలో సోమవారం నాడు బీజేపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీఆర్ఎస్ శ్రేణులను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నాడు దేవరుప్పులకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏం అభివృద్ది జరిగిందని బండి సంజయ్ ప్రశ్నించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్లలకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.. గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి..

దేవరుప్పుల ఘటనలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన తర్వాత మంత్రి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు బీజేపీకి చెందిన 500 మంది కార్యకర్తలు తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారన్నారు. బీజేపీ కార్యకర్తలే తమ పార్టీ కార్యకర్తలపై రాళ్లతో దాడికి దిగారని దయాకర్ రావు ఆరోపించారు. ఈ దాడిలో గాయపడిన ఓ మహిళ ఈ విషయం తనకు తెలిపిందన్నారు. ఏ పార్టీకి సంబంధం లేని ఆ మహిళ జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అక్కడకు చేరుకుందన్నారు. కానీ రెండు పార్టీల కార్యకర్తల దాడితో ఆమె అక్కడి నుండి వెళ్లే క్రమంలో గాయపడిందన్నారు. బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరడంతో తనకు గాయమైందని బాధితురాలు తనకు చెప్పిందని మంత్రి దయాకర్ రావు చెప్పారు. ఈ దాడి విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని మంత్రి దయాకర్ రావు చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రలో 500 మంది గుండాలున్నారని మంత్రి దయాకర్ రావు ఆరోపించారు. మతం పేరుతో బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని ఆయన విమర్శించారు. 

దేవరుప్పులలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడి చేసిందని ఆ పార్టీ ఆరోపించింది. తమ పార్టీ కార్యకర్తలపై బీజేపీ దాడికి దిగిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రెండు పార్టీల కార్యకర్తల ఘర్షణలో పలువురు గాయపడ్డారు.