మే 5న సదరన్ కౌన్సిల్ సమావేశం.. విభజన అనంతర సమస్యలను లేవనెత్తనున్న తెలంగాణ..!
మే 5వ తేదీన చెన్నైలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అంశాలను తెలంగాణ లేవనెత్తనున్నట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్: మే 5వ తేదీన చెన్నైలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అంశాలను తెలంగాణ లేవనెత్తనున్నట్టుగా తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న బకాయిలు, కేంద్రం నుంచి అనుమతుల సమస్యలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉంది. సదరన్ జోనల్ కౌన్సిల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం బీఆర్కే భవన్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న బకాయిలు, అనుమతులు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ, 10వ షెడ్యూల్ సమస్యలపై సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. విభజన అనంతర సమస్యల పరిష్కారంలో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశాలు విఫలమవడంతో వాటిని సదరన్ జోనల్ సమావేశంలో లేవనెత్తాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. విభజన తర్వాత అన్ని సమస్యలను 10 సంవత్సరాలలో పరిష్కరించాలి. గతేడాది సెప్టెంబరులో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి సంస్థల భూములు, భవనాలు, బ్యాంకు నిధులను ఏపీ, తెలంగాణల మధ్య జనాభా ప్రతిపాదికన 52:48 నిష్పత్తిలో వాటా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9 (కార్పొరేషన్లు మొదలైనవి), 10 (శిక్షణా సంస్థలు) కింద జాబితా చేయబడిన సంస్థలు అనేక వేల కోట్ల రూపాయల విలువైనవి. ఈ క్రమంలోనే తెలంగాణ ఆ డిమాండ్ను వ్యతిరేకించింది.