రామంతాపూర్ నారాయణ కాలేజ్ ఘటన.. ఇంటర్ బోర్డ్ సీరియస్, కాలేజీలకు కీలక ఆదేశాలు
హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం వ్యవహారంపై తెలంగాణ ఇంటర్ బోర్డ్ సీరియస్ అయ్యింది. ఇకపై ఇంటర్ విద్యార్ధుల సర్టిఫికెట్లు ఆపొద్దని కాలేజీలను ఆదేశించింది.
హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ విద్యార్ధుల సర్టిఫికెట్లు ఆపొద్దని కాలేజీలను ఆదేశించింది. సర్టిఫికెట్లు జారీ చేయకపోతే చర్చలు తప్పవని హెచ్చరించింది. ఇకపోతే.. హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కాలేజీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. కాలేజ్ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also REad:విద్యార్ధి ఆత్మహత్యాయత్నం వ్యవహారం.. తెలంగాణ సర్కార్ సీరియస్, నారాయణ కాలేజీకి నోటీసులు
కాగా.. రామంతాపూర్లోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. టీసీ తీసుకునేందుకు కాలేజీకి వెళ్లిన విద్యార్ధి ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి ఆయనను టీసీ ఇవ్వమని కోరాడు. అయితే గతకొద్దిరోజులుగా బాధిత విద్యార్ధి టీసీ కోసం కాలేజీకి వెళ్తుంటే తిప్పుతున్నారు. దీంతో విసిగిపోయిన ఆ విద్యార్ధి ప్రిన్సిపాల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
అంతేకాదు.. శరీరం మంటల్లో కాలిపోతుండగానే ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని పట్టుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అరుపులు , కేకలు వినిపించడంతో ఏవో అశోక్ రెడ్డి ప్రిన్సిపాల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ముగ్గురి మంటలను అదుపు చేసి ఆసుపత్రికి తరలించారు. తొలుత గాంధీ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి తరలించారు.