ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మరోసారి విజయం సాధిస్తుందంటూ విడుదలైన ఫేక్ సర్వేపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. 

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మరోసారి విజయం సాధిస్తుందంటూ విడుదలైన ఫేక్ సర్వేపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది.

ఏపీ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే నిర్వహించిందని, అందులో టీడీపీకి 126, వైసీపీకి 39, జనసేనకు 10 సీట్లు వస్తాయంటూ నకిలీ సర్వే తయారు చేసి ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీ ఎన్నికలపై తాము ఎలాంటి సర్వేలు చేయలేదని, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పేరుతో సర్వేలను తయారు చేసుకుని తప్పుడు ప్రచారం చేసి తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు.

టీఎఫ్‌సీ మీడియా, వీరపనేని రామకృష్ణ నేతృత్వంలోని మ్యాంగో అండ్ వాక్డ్ ఔట్, అదుగాని మల్లేశ్ నేతృత్వంలోని ఛాలెంజ్ మిత్ర, చీపురుపల్లి రాంబాబు నేతృత్వంలోని టాలీవుడ్ నగర్ సంస్థలు ఈ ఫేక్ సర్వేలను ప్రచారం చేస్తున్నట్లు హరిప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన ఫిర్యాదుతో పాటు యూట్యూబ్ లింకులు, అందులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన వీడియోలను హరిప్రసాద్ పోలీసులకు అందజేశారు.

ఆయన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 71 (సీ), రెడ్‌విత్, 171 (ఎఫ్‌), 171 (జీ), 417, 420, 465, 468, 471, 505(1), (సీ), 505(2), రెడ్‌విత్‌ 120(బీ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్‌ 66(డీ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం లోక్‌నీతి-సీఎస్డీఎస్ సర్వే పేరుతో తప్పుడు సర్వేను ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.