మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కవితకు హైకోర్టులో ఊరట లభించింది. 

మహబూబాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ మాలోత్‌ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:ఎన్నికల్లో డబ్బు పంపిణీ.. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు జైలుశిక్ష

మాలోతు కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కూతురు. తన రాజకీయ జీవితాన్ని ఆమె 2009లో ప్రారంభించారు. 2009లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్ లో ఉన్నారు. బంజారా సామాజిక వర్గానికి చెందిన కవిత బద్రూ నాయక్ ను వివాహమాడారు.