హైకోర్టులో రేవంత్ రెడ్డి కి షాక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. రేవంత్ అరెస్ట్ పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. రేవంత్ అరెస్ట్ పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. అరెస్ట్ అక్రమమనడానికి తగిన కారణాలు చూపలేదని హైకోర్టు పేర్కొంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కేసీఆర్ కొడంగల్ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి అడ్డుకునే అవకాశం ఉందనే కారణంతో.. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.అయితే పోలీసులు ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి రేవంత్ను అరెస్ట్ చేశారంటూ కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ లీడర్ వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నికల సంఘాన్ని వివరణ కోరుతూ ఆదేశాలు జారీచేసింది న్యాయస్థానం. అంతేకాదు డీజీపీ నేరుగా హాజరుకావాలంటూ ఆదేశించింది. ఈ క్రమంలో డిసెంబర్ 17వ తేదీన మరోసారి దీనిపై విచారణ జరిపింది.
కాగా.. ముఖ్య మంత్రి సభ కాబట్టి.. ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం సోమవారం తుది తీర్పును వెలువరించింది. సరైన కారణాలు లేవంటూ.. రేవంత్ పిటిషన్ ని కొట్టివేసింది.