ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. 

హైదరాబాద్: బీజేపీ కార్యకర్త Sai Ganesh ఆత్మహత్య కేసులో మంత్రి Puvvada Ajay Kumar కు Telangana High Court శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోపుగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఇవాళ హైకోర్టులో పిల్ దాఖలైంది.ఈ పిల్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సాయి గణేష్ ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా ఎనిమిది మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29వలోపుగా వివరణ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ కేసులో సమగ్ర కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని ఏజీ హైకోర్టును కోరారు. అయితే ఈ నెల 29వ తేదీలోపుగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.మరో వైపు ఈ నోటీసుకు సమాధానం చెప్పడంతో పాటు సమగ్రంగా కౌంటర్ దాఖలు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.

సాయి గణేష్ అత్మహత్యపై ఆంటోని రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ జరపించాలని కోరాడు. ఆంటోని రెడ్డి తరపున న్యాయవాది అభినవ్ హైకోర్టులో వాదనలను విన్పించారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగు చూస్తాయన్నారు.

ఈ నెల 14న ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగిన సాయి గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించాడు. తనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 16 కేసులు పెట్టించాడని సాయి గణేష్ చెప్పారు. అంతేకాదు తనపై రౌడీ షీట్ ను కూడా ఓపెన్ చేశారని సాయి గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో మీడియాకు చెప్పారు. తాను పురుగుల మందు తాగడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులే కారణమని కూడా ఆయన మీడియాకు వివరించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో సాయి గణేష్ నుండి పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదు.

ఈ నెల 20వ తేదీన సాయి గణేష్ ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. అదే రోజున రాజ్ భవన్ లో తమిళిసైసౌందరరాజన్ తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.

సాయి గణేష్ ఆత్మహత్యతో ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మంలో మంత్రి ఫ్లెక్సీలను బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి., ప్రభుత్వాసుపత్రిలో కూడా దాడికి దిగారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. 

ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్రమంగా కేసులు పెట్టించిన విషయం వెలుగు చూసింది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనల కార్యక్రమాలు చేయనుంది. ఖమ్మంలో పోలీసుల తీరును విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

సాయి గణేష్ ఆత్మహత్య చేసుకొన్న అంశాన్ని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సాయి గణేష్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. సాయి గణేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాయి గణేష్ కుటుంబ సభ్యులను రెండు రోజుల క్రితం పరామర్శించారు. 

సాయి గణేష్ ఆత్మహత్య విషయాన్ని తీసుకొని రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఏ రకంగా వ్యవహరిస్తుందోననే విషయమై ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తుంది. మరో వైపు ఈ ఘటనకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను బాధ్యుడిగా చేసి మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయమై ఎఫ్ఐఆర్ లో పువ్వాడ అజయ్ కుమార్ పేరును చేర్చాలని కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.