Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టు


సుప్రీంకోర్టు  ఉత్తర్వులు  వచ్చిన  తర్వాతే  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును  విచారించాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది. దీంతో  ఈ కేసు  విచారణను ఇవాళ  మధ్యాహ్నానికి  వాయిదా  వేసింది. 

Telangana  High  Court  decides to  hearing  MLAS  poaching Case  today afternoon
Author
First Published Nov 23, 2022, 11:13 AM IST

హైదరాబాద్: ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో  సుప్రీంకోర్టు  ఉత్తర్వులు  వచ్చిన  తర్వాత  విచారణ  జరుపుతామని  తెలంగాణ  హైకోర్టు  బుధవారంనాడు   తెలిపింది.మొయినాబాద్  ఫాంహౌస్ లో  ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసును  బుధవారంనాడు  ఉదయమే  హైకోర్టు  విచారణను  చేపట్టింది.నిన్న  కూడా ఈ కేసుపై  హైకోర్టు  విచారణ నిర్వహించింది.  సుప్రీంకోర్టు  ఉత్తర్వులను  ఇవాళ  ఉదయమే  అందించాలని హైకోర్టు  నిన్ననే  ఆదేశించింది.  ఇవాళ  ఉదయం ఈ కేసు  విచారణ ప్రారంభం కాగానే  సుప్రీంకోర్టు ఉత్తర్వులు  ఎక్కడని  హైకోర్టు  ప్రశ్నించారు. ఇవాళ సాయంత్రం వరకు  సుప్రీంకోర్టు  ఉత్తర్వులు  వచ్చే  అవకాశం  ఉందని ప్రభుత్వం  తరపు లాయర్లు  హైకోర్టు దృష్టికి  తీసుకువచ్చారు.  దీంతో  కేసు  విచారణను  మధ్యాహ్నం  రెండున్నరకి  వాయిదా  వేసింది  హైకోర్టు. 

బీఎల్  సంతోష్ కి  నోటీసు  ఇచ్చేందుకు  ఈ నెల  16వ తేదీ నుండి  ప్రయత్నిస్తున్నట్టుగా  అడ్వకేట్ జనరల్  హైకోర్టుకు తెలిపారు. చివరకు  ఢిల్లీ పోలీసుల సహయంతో  బీజేపీ కార్యాలయంలో  బీఎల్  సంతోష్ కి నోటీసులు  అందించినట్టుగా ఏజీ చెప్పారు. బీఎల్  సంతోష్  సిట్  ముందుకు  వస్తే  వాస్తవాలు  తెలుస్తాయని  ఏజీ  హైకోర్టు  దృష్టికి  తీసుకెళ్లారు.సిట్  విచారణ పారదర్శకంగా  జరుగుతుందని  ఏజీ  తెలిపారు. బీఎల్  సంతోష్  చట్టాన్ని  ధిక్కరించలేదని  ఆయన  తరపు  న్యాయవాది  రాంచందర్ రావు చెప్పారు. బీఎల్  సంతోష్  41 సీఆర్‌పీసీ ని  ఛాలెంజ్  చేయాలనుకుంటున్నారా  అని హైకోర్టు  ప్రశ్నించింది. సిట్  విచారణకు  హాజరయ్యేందుకు  బీఎల్  సంతోష్  గడువు  కోరుతున్నారా  అని కూడా   న్యాయస్థానం  ప్రశ్నించింది. 

విచారణకు  బీఎల్  సంతోష్  రాకపోతే  సాక్ష్యాలు  తారుమారు  చేసే  అవకాశం  ఉందని ప్రభుత్వ  తరపు  న్యాయవాది  వాదించారు.  అయితే  ఈ  కేసు విషయంలో  సుప్రీంకోర్టు   ఉత్తర్వులు  ఇచ్చిన  ఆదేశాలను  పరిశీలించిన  తర్వాతే  విచారణ  చేపట్టనున్నట్టుగా  హైకోర్టు తెలిపింది.  దీంతో  ఈ  కేసు  విచారణను  ఇవాళ మధ్యాహ్నానికి  వాయిదా  వేసింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios