యునెస్కో గడువు డిసెంబర్ వరకే .. నిర్లక్ష్యంతో నిందలు తప్పవు: రామప్ప ఆలయ సంరక్షణపై హైకోర్టు వ్యాఖ్యలు
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో చారిత్రక సంపదను సంరక్షించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.
రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పత్రికల కథనాలపై సుమోటాగా విచారణ చేపట్టింది న్యాయస్థానం. యునెస్కో విధించిన గడువు డిసెంబర్ నెలాఖరు వరకు వుండటంతో సమగ్ర సంరక్షణ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆగస్టు 4న తొలి సమావేశం నిర్వహించాలని.. క్షేత్ర స్థాయిలో సంయుక్త పరిశీలన జరపాలని ఆదేశించింది.
ALso Read:రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం.. ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు
నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం గర్వకారణమని న్యాయస్థానం హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను తీర్చిదిద్దాలని హైకోర్ట్ కోరింది. యునెస్కో గడువులోగా కార్యాచరణ చేపట్టి శాశ్వత గుర్తింపు దక్కించుకోవాలని సూచించింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని హైకోర్టు హెచ్చరించింది. రామప్ప అభివృద్ధి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తామన్న కోర్టు.. తదుపరి విచారణ ఆగస్టు 25కి వాయిదా వేసింది.