రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం.. ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు
వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా.. మనదేశం నుంచి 2020కి గాను రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా.. మనదేశం నుంచి 2020కి గాను రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.
అంతేకాదు తెలుగు రాష్ట్రాల నుంచి వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డుల్లోకెక్కింది. ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ 1213లో నిర్మించిన రామప్ప ఆలయాన్ని.. శిల్పి రామప్ప పేరుతోనే పిలుస్తున్నారు. నీటిలో తేలియాడే రాళ్లతో పాటు అద్భుత శిల్ప సంపద ఈ ఆలయం ప్రత్యేకత. ఇప్పటివరకు ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1,121 కట్టడాలు చోటు దక్కించుకున్నాయి.