తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు... ఈ రెండ్రోజులు ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఆ జిల్లాలేవో తెలుసా?

Telangana Weather : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలం మొదలైనప్పటి నుండి వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లగానే ఉంది. కానీ ఇప్పుడు వర్షాలు కురవడం ఆగిపోయింది... దీంతో భానుడి భగభగలు పెరిగాయి. ఉదయమే ఎండలు సుర్రుమంటున్నాయి... ఇక మధ్యాహ్నం బయటకు వచ్చే పరిస్థితి ఉండటంలేదు. ఈ రెండ్రోజులు (ఏప్రిల్ 24, 25) ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని... తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

తెలంగాణలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ : 

తెలంగాణవ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది... కానీ ఓ తొమ్మిది జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.   ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసారు. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని... పగటిపూట బయటకు రావద్దని సూచిస్తున్నారు. 

ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... రానున్న రెండ్రోజులు ఈ జిల్లాలోని ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారం ఇక్కడ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఒక్క ఈ జిల్లాలోనే కాదు  ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఈ 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 

ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అంటే ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరగా నమోదయ్యే అవకాశాలున్నాయన్నమాట. వడగాలులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హెచ్చరించారు. 

Scroll to load tweet…