జర్నలిస్టులూ ఫ్రంట్లైన్ వారియర్లే, 28 నుంచి వ్యాక్సినేషన్: తెలంగాణ డీహెచ్ ప్రకటన
తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి పాత్రికేయులకు సమాచార ప్రసార శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని శ్రీనివాసరావు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కోవిడ్ కట్టడికి అన్ని శాఖలు సమష్టిగా కృషిచేస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 4.1శాతంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 1.47 కోట్ల పరీక్షలు నిర్వహించినట్టు శ్రీనివాసరావు తెలిపారు.
తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి పాత్రికేయులకు సమాచార ప్రసార శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200లకు పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటివరకు 56 లక్షల మందికి టీకాలు వేసినట్టు డీహెచ్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.18 లక్షల కొవిషీల్డ్, 2.5 లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Also Read:కరోనా వేళ జూనియర్ డాక్టర్ల సమ్మె: తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి మరిన్ని డోసులు వస్తాయన్నారు. నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండే వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వారికి ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్ఎంసీ ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెలాఖరు నాటికి 3 లక్షల మందికి కొవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 92.52 శాతంగా, మరణాల రేటు 0.56 శాతంగా ఉందని శ్రీనివాసరావు తెలిపారు.
కొవిషీల్డ్ తీసుకున్నవారు 12 నుంచి 16 వారాల మధ్యలో రెండో డోసు తీసుకోవాలని డీహెచ్ సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతి 10 మందిలో నలుగురికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బెడ్ల సంఖ్య 55,120కి పెరిగిందన్నారు. ప్రస్తుతం 31,375 బెడ్లు ఖాళీగా ఉన్నాయిని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు 23,745 మంది వుంటే వీరిలో 40 శాతం రోగులు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినవారేనన్నారు . ఐసీయూ బెడ్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో 612, ప్రైవేటులో 3,977 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ పడకలు 9,718 అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు వివరించారు.