తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. వారంతా చాలా కాలంగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించడంతో.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే, తెలంగాణ సర్కార్ ఇటీవల మరోసారి టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్కు దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. టెట్-2023 దరఖాస్తు గడువు ఆగస్టు 16వ తేదీతో ముగిసింది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్1, పేపర్2 పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. సెప్టెంబర్ 27న ఫలితాలను ప్రకటించనున్నారు.
