టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి తనకు సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా ఎస్ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎస్ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌కు గవర్నర్ లేఖ రాశారు. అలాగే దర్యాప్తు నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌ను కూడా ఆమె ఆదేశించారు. వీటితో పాటు టీఎస్‌పీఎస్సీలో విధులు నిర్వహిస్తూ పరీక్షలు రాసిన సిబ్బంది (రెగ్యులర్ , ఔట్‌సోర్సింగ్) వివరాలు ఇవ్వాలని గవర్నర్ కోరారు. 

ఈ కేసులో భాగంగా ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సురేష్ , రమేష్ , షమీమ్ లను సిట్ అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 12కి చేరింది. మరోవైపు.. పేపర్ లీక్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి మరికొన్ని కొత్త పేర్లు వస్తున్నాయి. ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు సురేష్ పాత్రపై సిట్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. టీఎస్‌పీఎస్సీ నుంచి ఇతనే పేపర్‌ను బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సురేష్ ఎంతమందికి పేపర్ ఇచ్చాడన్న దానిపై సిట్ ఆరా తీస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్‌ల పెన్‌డ్రైవ్‌‌లలో సమాచారం లీకైనట్లు సిట్ గుర్తించింది. రాజశేఖర్ వాట్సాప్ చాటా ఆరా తీసింది సిట్. అలాగే టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న 42 మందికి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ఈ రోజు 9 మంది నిందితులను 7 గంటల పాటు ప్రశ్నించింది సిట్. దీనితో పాటు పలు అంశాలపై ఆధారాలను సేకరించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీమ్. 

ALso Read: పేపర్ లీక్‌లో ముగ్గురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర.. ఉద్యోగం చేస్తూనే పరీక్ష, సిట్ ముమ్మర వేట

ఇదిలావుండగా.. ఈ కేసులో అరెస్టైన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్, రేణుక ఆమె భర్త ఢాక్యానాయక్ బ్యాంకు ఖాతాలను సిట్ బృందం పరిశీలించింది. ఇ వల కాలంలో ఈ నిందితుల ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయా అనే కోణంలో కూడా సిట్ ఆరా తీస్తోంది. ఈ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా సురేష్‌ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ విచారిస్తున్న సురేష్ కు గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులు వచ్చినట్టుగా సమాచారం. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం విక్రయించి రేణుక డబ్బులు సంపాదించిందని సిట్ గుర్తించింది. నీలేష్, గోపాల్ లకు ప్రశ్నాపత్రాలు ఇచ్చి రూ. 14 లక్షలను రేణుక తీసుకుందని సిట్ గుర్తించింది. 

అటు టీఎస్‌పీఎస్‌సీ కాన్పిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండ్ శంకరలక్ష్మిని సిట్ అధికారులు మంగళవారం రాత్రి విచారించారు. శంకరలక్ష్మీ ఇచ్చిన సమాచారం మేరకు ప్రవీణ్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ల నుండి పెన్ డ్రైవ్ లను సిట్ బృందం సీజ్ చేసింది. ఈ పెన్ డ్రైవ్ లలో ప్రశ్నాపత్రాలు ఉన్నట్టుగా సిట్ బృందం గుర్తించింది.