వరంగల్ కేఎంసీ  మెడికో  ప్రీతి మరణంపై  రాజ్ భవన్ స్పందించింది. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు  చేసుకోకుండా చర్యలపై   గవర్నర్ వర్శిటీ  అధికారులను ఆదేశించారు.  

హైదరాబాద్: మెడికో ప్రీతి మృతిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ గా స్పందించారు. ప్రీతి మరణంపై నిజనిర్ధారణకు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని కాళోజీ మెడికల్ యూనివర్శిటీ వీసీని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు రాజ్ భవన్ అధికారులు మంగళవారంనాడు లేఖ రాశారు. మెడికో ప్రీతి మరణం భయంకరమైందిగా ఆ లేఖలో రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయమై వాస్తవాలు తెలుసుకోవడానికి అన్ని కోణాల నుండి విచారణ అవసరమని రాజ్ భవన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 

 కాలోజీ యూనివర్శిటీలో ర్యాగింగ్, వేధింపుల తరహ ఘటనలపై గవర్నర్ తమిళిసై నివేదిక కోరారు. మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనివేళలు , మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పనితీరు అంశాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించాయి రాజ్ భవన్ వర్గాలు.

ప్రీతిని నిమ్స్ కు తరలించడంతో కీలకమైన సమయం కోల్పోయినట్టుగా రాజ్ భవన్ వర్గాలు ఆ లేఖలో అభిప్రాయపడ్డాయి. మెడికో ప్రీతిని ఎంజీఎంకు తరలించి మెరుగైన చికిత్స అందించాల్సి ఉండేదని రాజ్ భవన్ అభిప్రాయపడింది. 

గ్రీవెన్స్ సెల్ పనితీరు, బాధితుల సమస్యలను పరిష్కరించడం, మెడికోల ఫీడ్ బ్యాక్ వంటి అంశాల గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించింది రాజ్ భవన్.ర్యాగింగ్ నిరోధక చర్యలు, యూనివర్శిటీ వీసీ నియంత్రణలో ఉన్న యంత్రాంగంపై నివేదిక ఇవ్వాలని లేఖలో కోరారు. ర్యాగింగ్ నిరోధక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని రాజ్ భవన్ ఆ లేఖలో సూచించింది. 

ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని బలోపేతం చేయాలని కోరాయి రాజ్ భవన్ వర్గాలు.సైకియాట్రీ విభాగానికి చెందిన హెచ్ఓడీ నేతృత్వంలో విద్యార్ధి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది.

also read:ప్రీతి మృతికి రూ. 50 లక్షల అడ్మిషన్ బాండ్ కూడా కారణమేనా? వెలుగులోకి కొత్త ట్విస్ట్.. చివరిమాటల్లో ఏముంది??

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాజ్ భవన్ ఆదేశించింది. ఈ మేరకు వ్యూహలను రూపొందించాలని కూడా రాజ్ భవన్ వర్గాలు ఆ లేఖలో వీసీని ఆదేశించాయి.