తెలంగాణలో (Telangana) వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు పెరిగాయి. నేటి నుంచి (ఫిబ్రవరి 1) కొత్త మార్కెట్ విలువలు (market value) అమల్లోకి రానున్నాయి. కొత్త విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.
తెలంగాణలో (Telangana) వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు పెరిగాయి. నేటి నుంచి (ఫిబ్రవరి 1) కొత్త మార్కెట్ విలువలు (market value) అమల్లోకి రానున్నాయి. కొత్త విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. తెలంగాణ రివిజన్ ఆఫ్ మార్కెట్ వ్యాల్యూస్ గైడ్లైన్స్ అండ్ రూల్స్-1988 ప్రకారం భూముల విలువను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ కనీసం 50 శాతానికి, ఖాళీ స్థలాల విలువలను 35 శాతానికి, ఫ్లాట్ల విలువలను 25 శాతానికి సవరించినట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విలువలకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కానున్నాయి. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అయిదు నుంచి పది శాతం వరకూ కూడా విలువ పెరిగింది. సవరించిన మార్కెట్ విలువతో రాష్ట్రంలో తొలిసారిగా ఖాళీ స్థలం చదరపు గజం ధర రూ. లక్ష దాటింది.
అయితే ఇప్పటికే కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ రుసుములు కట్టి ఉంటే వారికి కొత్త చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింపునకు వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు అమలు కానున్నాయి. సవరించిన విలువల ఆధారం సాఫ్టవేర్ను సోమవారం రాత్రి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇక, హైదరాబాద్లో స్థిరాస్తి మార్కెట్ విలువలను భారీగా పెంచారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా గజం విలువ రూ.84,500 ఉన్న మార్కెట్ విలువను రూ.1,14,100గా సవరించారు. ఆ తర్వాత స్థానాల్లో ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో గజం మార్కెట్ విలువ రూ.39 వేలు ఉంటే సవరించిన విలువల ప్రకారం రూ. 52,700గా ఖరారు చేశారు.
ప్రభుత్వానికి భారీ ఆదాయం..
పాత మార్కెట్ విలువతో రిజిస్ట్రేషన్లకు సోమవారం అఖరి తేదీ కావడంతో రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డుస్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రంలో సోమవారం వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి 10,127 డాక్యుమెంట్లు రిజిస్టర్ అవ్వగా.. ప్రభుత్వానికి రూ.82 కోట్ల ఆదాయం సమకూరింది. ధరణి పోర్టల్ ద్వారా మరో 1,500 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగగా.. రూ.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా రెండు రకాల రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు రూ.100 కోట్ల ఆదాయం దాటింది.