ఇప్పటికే కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ద్వారా రూ. 3వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఖానామెట్ లో మరో 27, పుప్పాల గూడలో 94 ఎకరాలకు వేలానికి నిర్ణయించారు.

హైదరాబాద్‌ : తెలంగాణ సర్కార్ మరోసారి ప్రభుత్వ భూములు అమ్మేందుకు నిర్ణయం తీసుకుంది. భూముల వేలం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ద్వారా రూ. 3వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఖానామెట్ లో మరో 27, పుప్పాల గూడలో 94 ఎకరాలకు వేలానికి నిర్ణయించారు.

సోమవారం నోటిఫికేషన్, 9న ఫ్రీ బ్రిడ్.. తద్వారా మరో రూ.4 వేల కోట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. హౌసింగ్, ఆర్టీసీ భూముల వేలానికీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

కాగా, గత నెలలో కోకాపేట భూముల వేలం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, భూముల వేలానికి హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో జులై 15 కోకాపేట్, ఖానామెట్ భూముల వేలం జరిగింది. ఈ భూముల వేలంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కోకాపేట్ భూముల కోసం బడా సంస్థలు రంగంలోకి దిగాయి. ఆన్‌లైన్ భూముల వేలాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌డీసీ నిర్వహించనుంది. హెచ్‌ఎండీఏకు చెందిన 49 ఎకరాల్లో 7 ఫ్లాట్లను వేలం వేస్తోంది ప్రభుత్వం. వేలంలో 5,000 కోట్లు రావొచ్చని అంచనా వేస్తోంది. 

అంతకుముందు బీజేపీ నేత విజయశాంతికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూములను వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే భూముల వేలాన్ని నిలుపుదల చేయాలంటూ విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూముల విక్రయానికి సంబంధించిన జీవో నెం 13ను కొట్టివేయాలని విజయశాంతి పిటిషన్‌లో కోరారు.

దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదమున్నందున ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నామని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంక్ ఏర్పాటుపై పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.