తెలంగాణలోని విద్యావ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సూర్యాపేట జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్ రెడ్డిపై  తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఆయనను పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేసింది. సూర్యాపేట ఆర్డీఓ రాజేంద్రకుమార్ కు జడ్పీ సీఈఓగా  బాధ్యతలు అప్పగించింది.

సూర్యాపేట: తెలంగాణలో విద్యావ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సూర్యాపేట జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయానికి ఆయనను అటాచ్ చేస్తూ ప్రభుత్వం సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లాలో ఆదివారం నాడు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో విద్యావ్యవస్థ దారుణంగా ఉందన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థలు చెప్పిందే ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన విమర్శించారు.నారాయణ, చైతన్య కాలేజీలే స్కూల్స్ నడపమంటేనే నడుపుతున్నారని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

విద్యా వ్యవస్థ తీరు మారకపోతే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. సూర్యాపేట జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్ రెడ్డిని వెంటనే కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. సూర్యాపేట జడ్పీ సీఈఓగా స్థానిక ఆర్డీఓ రాజేంద్రకుమార్ కు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.