కామారెడ్డిలో జిల్లాలోని నిజాంసాగర్ మండలం హసన్పల్లి గేటు వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
కామారెడ్డిలో జిల్లాలోని నిజాంసాగర్ మండలం హసన్పల్లి గేటు వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేలు అందజేయనున్నట్టుగా చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టుగా తెలిపారు. అదే సమయంలో రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఇక, ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు , క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి అందజేయనున్నట్టుగా ప్రధాని మోదీ ప్రకటించారు.
అసలేం జరిగిందంటే.. పిట్లం మండలం చిల్లర్గ గ్రామానికి చెందిన చౌదర్పల్లి మాణిక్యం అనే వ్యక్తి కొద్ది రోజుల కిత్రం మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు బంధువులు టాటా ఏస్లో శనివారం సాయంత్రం చిల్లర్గ నుంచి ఎల్లారెడ్డిలో ఆలయంలో నిద్ర చేసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న 26 మందిలో 9 మంది మృతిచెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతులను డ్రైవర్ సాయిలు, చౌదర్పల్లి లచ్చవ్వ, చౌదర్పల్లి వీరమణి, చౌదర్పల్లి సాయవ్వ, అంజవ్వ, పోచయ్య , గంగవ్వ, ఎల్లయ్య, ఈరమ్మగా గుర్తించారు. వ్యవసాయం, కూలిపనులు చేసుకొని బతికే నిరుపేదలే. ఈ ప్రమాదం సమాచారం అందుకన్న ఎల్లారెడ్డి సీఐ ఘటన స్థలానికి చేరుకని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
