Prajapalana: ప్రజాపాలనపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
Prajapalana: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీ పథకాల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
![Telangana cs shanti kumari teleconference with collectors on praja palana program KRJ Telangana cs shanti kumari teleconference with collectors on praja palana program KRJ](https://static-ai.asianetnews.com/images/01egnkmks11mj53y2n4anws2j8/ts-govt-jpg_363x203xt.jpg)
Prajapalana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది. డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ వరకు జరిగే ఈ కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. జనం తాకిడితో ప్రజాపాలన కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజా పాలనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై ప్రజా పాలన కార్యక్రమాన్ని నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోని వారు తర్వాతి సదస్సుల్లో అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రజా పాలన కార్యక్రమ అమలుపై బుధవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజాపాలన సదస్సులు ముగియగానే.. నెల 6 నుండి 17 వరకు వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. ఈ నెల 17 లోపు అన్ని అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. అప్లికేషన్ల డేటా ఎంట్రీపై రాష్ట్రస్థాయి సిబ్బందికి ఈ నెల 4వ తేదీ, జిల్లా స్థాయి సిబ్బందికి 5వ తేదీన శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
ఆధార్, రేషన్ కార్డ్ ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా ఎంట్రీ చేయాలిన ఆదేశించారు. కాగా, కొందరు లబ్ధిదారులు అన్ని పత్రాలు లేకపోవడంతో ప్రస్తుతం జరుగుతోన్న ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. తమకు ఆరు గ్యారెంటీలు అందవని ఆందోళన చెందవద్దనీ, ఇకపై నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ప్రకటన చేశారు.