తెలంగాణలో పొత్తులకు సంబంధించి రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామని.. సీపీఎం, సీపీఐలు సైతం ఒకటే కత్తి అన్నారు 

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీని నిలువరించాలనేదే తమ ప్రధాన ఎజెండా అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు కలిసినా స్వాగతిస్తామన్న ఆయన.. సీపీఎం, సీపీఐలు సైతం ఒకటే కత్తి అన్నారు. అవసరమైతే పదవులు త్యాగం చేస్తామన్నాని.. కందాల, రేగా కాంతారావు ఎవరి ఓట్లతో గెలిచారని సాంబశివరావు ప్రశ్నించారు. నటించడం తమకు రాదని.. సీపీఎం, సీపీఐ ఎప్పటికీ అన్నదమ్ములేనని ఆయన పేర్కొన్నారు. 40, 50 స్థానాల్లో మా ప్రభావం వుంటుందని కూనంనేని అన్నారు. 

మరోవైపు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి పేపర్ లీక్ పైనా కూనంనేని సాంబశివరావు స్పందించారు. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌ను నాశనం చేసేందుకు కుట్రపన్నిన బండి సంజయ్ పై ఉపా వంటి కేసులను పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లీక్ వెనుక ప్రమేయం వున్న అందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టాలని.. లీకేజ్ వల్ల విద్యార్ధులకు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. బండి సంజయ్ కి, పలువురికి మధ్య జరిగిన చాటింగ్ కు సంబంధించి ఆధారాలు దొరికినట్లు పోలీసులు చెబుతున్నారని కూనంనేని అన్నారు. 

Also Read: తప్పదనుకుంటే బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు : జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాగా.. త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పదనుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పొత్తును ప్రజలే నిర్ణయిస్తారని జానారెడ్డి వ్యాఖ్యానింనచారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని ఆయన అన్నారు. రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేయడాన్ని కేసీఆర్, కేటీఆర్, కవిత ఖండించారని జానారెడ్డి గుర్తుచేశారు.