టార్గెట్ తెలంగాణ: రేపు రాహుల్తో 40 మంది కాంగ్రెస్ నేతల భేటీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఢిల్లీకి రావాలని ఆ పార్టీ నాయకత్వం నుండి పిలుపొచ్చింది
హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఢిల్లీకి రావాలని ఆ పార్టీ నాయకత్వం నుండి పిలుపొచ్చింది. శుక్రవారం నాడు 40 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు 40 మంది అత్యవసరంగా ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఎన్నికలకు సంబంధించిన వ్యూహారచనపై పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే 105 మంది అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ మహకూటమిలో చేరనుంది. ఈ మేరకు విపక్షాలతో చర్చలు సాగుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏఏ సీట్లలో పోటీ చేయాలనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. విపక్షాల మహా కూటమి మధ్య పొత్తులు, సీట్ల సర్ధుబాటు పూర్తైతే అభ్యర్థుల ప్రకటన సులభమయ్యే అవకాశం ఉంది.
పార్టీ ప్రచార కమిటీ ఏర్పాటుతో పాటు ఇతర విషయాలపై చర్చించేందుకు రాహుల్గాంధీతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం పదిగంటలకు సమావేశంకానున్నారు. ఉత్తమ్ తో పాటు మరో 40 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ ఢిల్లీకి వెళ్లనున్నారు.
మరో వైపు అభ్యర్థుల ప్రకటనకు ఇబ్బందులు లేని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలనే కొందరు నేతలు కూడ డిమాండ్ చేస్తున్నారు. పోటీలు లేని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే ఇతర సీట్లలో అభ్యర్థులను ప్రకటించడం సులువుగా ఉంటుందనే వాదించే వారు కూడ లేకపోలేదు.
అయితే టీఆర్ఎస్ను దెబ్బతీయాలంటే విపక్షాలతో కూటమి కూడ అవసరమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, కొందరు నేతలు మాత్రం కూటమిని వ్యతిరేకిస్తున్నారు. ఈ కూటమి వల్ల తమకు సీట్లు దక్కవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. దీంతో కొన్ని పార్టీలు లేదా కూటమి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.