తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించారు. ప్రభుత్వ భూములను విక్రయించాలనే కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఎంపికపై తెలంగాణ కాంగ్రెసు నేత, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఆయన తనదైన రీతిలో స్పందించారు. తాను పీసీసీ చీఫ్ రేసులో లేనని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడిని ఎఐ,సీసీ ఎంపిక చేస్తుందని ఆయన చెప్పారు. అది ఎఐసిసి పరిధిలోని అంశమని చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనేది ఎఐసిసికి తెలుసునని ఆయన అన్నారు. పిసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. శ్రీధర్ బాబు కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

ఇదిలావుంటే, భూములను అమ్మాలనే కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి భూములు విక్రయించడం సరి కాదని ఆయన అన్నారు భూముల అమ్మకం జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు విక్రయిస్తుంటే తప్పు పట్టిన టీఆర్ఎస్ నేతలు ప్రస్తుత చర్యలను ఎలా సమర్థించుకుంటారని ఆయన అడిగారు. భూములు కాపాడుకోవడానికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, భూములు విక్రయించవద్దని తాను ఆనాటి సీఎంలకు కూడా చెప్పామని ఆయన అన్నారు 

మిగులు రాష్ట్రం ఇస్తే అప్పుల తెలంగాణగా మార్చేశారని ఆయన అన్నారు. భూములు ఎవరికి విక్రయిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.