అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పార్టీ మీద కోపమొచ్చింది
‘దళితుడినయినందుకే పార్టీ నేత జానారెడ్డి సహకరించడం లేదు’
అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు తన పార్టీనేత జానారెడ్డి తెగ కోపమొచ్చింది.
తన విప్ పదవికి రాజీనామా చేసేశారు. ఈ రోజుఆయన నల్ల కండువాతో అసెంబ్లీకి హాజరయ్యారు. తానింక కాంగ్రెస్ సభ్యల మధ్య కూర్చునేది లేదని కూడా చెప్పేశారు. సహచర ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి,చిన్నారెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయనకు కోపం ఎందుకొచ్చిందంటే... సభలో మాట్లాడేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను అధికార పార్టీ అడ్డుకుందని, అయితే, అదే సమయంలో సొంత పార్టీ కూడా తనకు అండగా నిల్వలేదు.
అదే కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కి మైక్ ఇవ్వాలని జానారెడ్డి పదే పదే స్పీకర్ ను కోరారు.
‘నాకు మాత్రం అవకాశం ఇప్పించలేదు. ఇది ఎంతో ఆవేదన కల్గించింది.ఎస్సీ, ఎస్టీ బిల్లు పై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేసింది.ప్రభుత్వ ఒత్తిడికి స్పీకర్ తలొగ్గారు. సబ్ కమిటీ సభ్యుడినైన నాకే అవకాశం రాకుండా చేశారు. అన్నీ పక్షాలు దళితుల విషయంలో సభను తప్పుదారి పట్టించాయి. ఎత్తి చూపుదామనుకుంటే మాట్లాడే అవకాశం లేదు,’అని సంపత్ అన్నారు.
‘ మా నాయకులు కూడా నా వైపు నిలవలేదు. దళిత బిడ్డగా నా వైపు నిలవాల్సిన బాధ్యత వాళ్లకుంది. అయితే అలా జరగ లేదు. ఈ విషయం గురించి రాత్రంతా ఆలోచించాను, ఆవేదనచెందాను. ఈ రోజు కాంగ్రెస్ తో కాక ప్రత్యేకంగా కూర్చుంటాను,’ అని ఆయన అన్నారు.
జోకర్లు, బ్రోకర్ల కోసం రాత్రి 11 గంటల వరకు సభ నడిపారు. నాకు మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన విమర్శించారు.