సీబీఐకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమ్మతిని ఉపసంహరించుకోవాలన్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్: సీబీఐకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమ్మతిని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని బీహార్లో అధికార ‘మహాఘట్బంధన్’ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్: కేంద్ర దర్యాప్తు సంస్థలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రంలో చొరబడడం సరికాదని వ్యాఖ్యానించారు. వివరాల్లోకెళ్తే.. గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన బీహారీ (బీహార్) సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్లో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తోనూ భేటీ అయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దేశ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ అంశాల గురించి మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేతృత్వంలోని పరిపాలన సీబీఐ, ఈడీ, ఐటీలను ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు. అయితే సీబీఐని బీహార్లో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని సీఎం తన వైఖరిని సమర్థించుకున్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం దీనిని అనుసరించాలని కేసీఆర్ కోరారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర అంశాలు అనీ, సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రంలో చొరబడడం సరికాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని అన్ని రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సర్కారు అన్ని కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. "దేశంలోని రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి సీబీఐ సహా అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తోంది. ఇది ఇప్పటికైనా ఆపివేయాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకి తమ సమ్మతిని ఉపసంహరించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది.. పోలీసింగ్ రాష్ట్రానికి సంబంధించినది" అని కేసీఆర్ అన్నారు.
సీబీఐకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమ్మతిని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని బీహార్లో అధికార ‘మహాఘట్బంధన్’ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం-1946లోని సెక్షన్ 6 ప్రకారం సీబీఐకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధిలో దర్యాప్తు చేయడానికి సమ్మతి అవసరం. సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటే, కేసు నమోదు చేయడానికి ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందాల్సిన అవసరం ఉంటుంది. కాగా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ సహా తొమ్మిది రాష్ట్రాలు తమ పరిధిలోని కేసులను సీబీఐ విచారించేందుకు ఇప్పటికే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.
ఇదిలావుండగా, నితీష్ కుమార్, కేసీఆర్ భేటీపై బీజేపీ స్పందించింది. విపక్షాల ఐక్యత పేరుతో కేసీఆర్, నితీష్ కుమార్ల మధ్య జరిగే సమావేశం ‘‘కొత్త కామెడీ షో’’ అని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షులు లాలూ ప్రసాద్.. ఇద్దరూ అవినీతి, కుటుంబ పాలనను ప్రవృత్తిని పంచుకున్నారని ఆరోపించారు.