కేసీఆర్ సంచలన నిర్ణయం: తాత్కాలికంగా 50 వేల మంది డాక్టర్లు, నర్సులు నియామకం
కరోనా విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2,3 నెలల కాలానికి తాత్కాలిక ప్రాదిపదికన దాదాపు 50 వేల మంది వైద్య సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైరస్ పరిస్థితులపై ప్రగతిభవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు
కరోనా విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2,3 నెలల కాలానికి తాత్కాలిక ప్రాదిపదికన దాదాపు 50 వేల మంది వైద్య సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో వైరస్ పరిస్థితులపై ప్రగతిభవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వారికి వెయిటేజీ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు.
వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నిషీయన్లు, ఫార్మాసిస్టులు, పారామెడికల్ సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని సీఎం సూచించారు. కష్టకాలంలో ప్రజలకు సేవ చేసేందుకు యువ వైద్యులు ముందుకు రావాలని.. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
Also Read:కరోనా తీవ్రత: అధికారులతో కేసీఆర్ కీలక సమీక్ష.. టీకాపైనే ప్రధాన చర్చ
వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తక్షణమే సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. వాటిల్లో సిబ్బందిని కూడా తక్షణం నియమించుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు మరింత అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారిని గుర్తించి టీకాలు వేస్తే బాగుంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు, కార్మికులను గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం సూచించారు.
అనంతరం కేంద్ర మంత్రి హర్షవర్ధన్తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణకు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యమంత్రి సూచనలపై హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోడీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.